విశాఖపట్నం, జూలై 30: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పరామర్శ యాత్ర రాజకీయ డ్రామాగా మారిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె, నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పరామర్శించేందుకు వెళ్లడం ద్వారా జగన్ తప్పు చేసిన వారిని సమర్థిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి శ్రీకాకుళం వరకు సుమారు 120 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఉద్దేశపూర్వకంగా గంటల తరబడి సాగదీసి రాజకీయ ప్రదర్శన నిర్వహించారని ఆరోపించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రయాణాన్ని ఆలస్యం చేశారని హోంమంత్రి విమర్శించారు. జైలు నిబంధనలపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ నిర్ణీత సమయంలో ములాఖత్కు వెళ్లకుండా, అనంతరం ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. నిజంగా పరామర్శించాలనే ఉద్దేశం ఉంటే కేటాయించిన సమయంలోనే వెళ్లాల్సిందని, ప్రమాదంలో మరణించిన బాధితుడి కుటుంబాన్ని కాకుండా నిందితులను పరామర్శించడం సమర్థనీయం కాదని అన్నారు.
జగన్ పర్యటన సందర్భంగా విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐపై వైసీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించడం తీవ్రంగా ఖండనీయమని అనిత అన్నారు. మహిళా పోలీసు అధికారిణిపై జరిగిన ఘటనను మహిళా లోకం మొత్తం ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు, అసభ్య ప్రవర్తన ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని పేర్కొంటూ, మహిళలను అవమానించే రాజకీయ సంస్కృతిని ప్రజలు అంగీకరించరని వ్యాఖ్యానించారు.
సిదిరి అప్పలరాజు వ్యవహారంలో ప్రమాదం అనంతరం సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందనే ఆరోపణల ఆధారంగానే కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు హోంమంత్రి తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. డాక్టర్ సుధాకర్ ఘటనను గుర్తు చేస్తూ, గత పరిణామాలను వైసీపీ నాయకులు గుర్తు చేసుకోవాలని సూచించిన ఆమె, మహిళా ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Sign in with Google to comment.