లోకకల్యాణం కోసం శ్రీశైలం శ్రీ భ్రమరాంబాదేవి వారికి సంప్రదాయబద్ధంగా కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు.
ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం ఈ విశేష ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా అమ్మవారికి సాత్త్విక బలి సమర్పించడం ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఈ ఉత్సవంలో భాగంగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, వండిన అన్నం వంటి వాటిని అమ్మవారికి సాత్త్విక బలిగా సమర్పించారు. ఆలయ వర్గాల ప్రకారం, ఈసారి దాదాపు 20 వేలకుపైగా గుమ్మడికాయలు, 5 వేలకుపైగా కొబ్బరికాయలు, లక్షకు పైగా నిమ్మకాయలు, అలాగే వండిన అన్నం (కుంభం) సమర్పించడం జరిగింది. ఉదయం ప్రాతఃకాల పూజల అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి నవావరణ పూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమ పూజలు, పారాయణాలు నిర్వహించారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంగా నిర్వహించబడ్డాయి.
అనంతరం ఆలయంలో రజకరంగవల్లి అనే ప్రత్యేక సంప్రదాయ పూజను నిర్వహించారు. ఇందులో రజకునిచే ప్రత్యేక ముగ్గు వేయించి, శ్రీచక్రం వద్ద విశేష పూజలు చేశారు. తర్వాత సాత్త్విక బలికి సిద్ధం చేసిన కొబ్బరికాయలు, గుమ్మడికాయలకు పూజలు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. తదుపరి హరిహరరాయ గోపుర ద్వారం వద్ద ఉన్న మహిషాసురమర్దిని అమ్మవారికి (కోటమ్మవారికి) కూడా ప్రత్యేక పూజలు చేసి సాత్త్విక బలి సమర్పించారు. ఈ రోజు సాయంత్రం శ్రీ మల్లికార్జున స్వామివారికి ప్రదోషకాల పూజల అనంతరం అన్నాభిషేకం నిర్వహించనున్నారు.
అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న సింహమండపం వద్ద వండిన అన్నాన్ని కుంభరాశిగా పోసి, సంప్రదాయం ప్రకారం స్త్రీవేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడంతో ఉత్సవంలోని ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుంది. చివరగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, పిండివంటలతో మహానివేదనం సమర్పించనున్నారు. అలాగే ఈ ఉత్సవంలో భాగంగా గ్రామదేవత అంకాళమ్మకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక స్వాములు, వేదపండితులు, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.