దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ టికెట్ చెకింగ్ సిబ్బంది మరోసారి ప్రయాణికుల సేవ, మానవతా దృక్పథానికి నిదర్శనంగా నిలిచారు. ఏప్రిల్ 5న ట్రైన్ నెం.13352 అలప్పుజా–ధన్బాద్ ఎక్స్ప్రెస్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి అన్నవరం స్టేషన్ దాటిన కొద్ది సేపటికే ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి.
ఈ పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు ఆన్డ్యూటీ టికెట్ చెకింగ్ సిబ్బందిని సంప్రదించగా, టీటీఐ/అమెనిటీస్ విజయవాడకు చెందిన శ్రీమతి జి. జ్యోతి వెంటనే స్పందించి అవసరమైన సహాయాన్ని అందించారు. ఆమె కమర్షియల్ కంట్రోలర్తో సమన్వయం చేసుకుని 108 అత్యవసర వైద్య సేవలను ఏర్పాటు చేశారు. పరిస్థితి అత్యవసరంగా ఉండటంతో రైలుకు ఎలమంచిలి స్టేషన్లో ప్రత్యేక హాల్ట్ కల్పించారు. అనంతరం టికెట్ చెకింగ్ సిబ్బంది సమన్వయంతో తల్లి, నవజాత శిశువును 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి సురక్షితంగా తరలించారు.
ప్రస్తుతం తల్లి, పాప ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సేవలో శ్రీమతి జి. జ్యోతి, శ్రీ బిపుల్ కుమార్, శ్రీ జుబేర్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి. ప్రశాంత్ సిబ్బంది చాకచక్యం, సేవాభావాన్ని అభినందించారు.
Comments
Sign in with Google to comment.