ఉప్పల్లో ఓటర్ల వివరాల సేకరణకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్న 40 ఏళ్లకు పైబడిన ఓటర్ల వివరాలను సమగ్రంగా సేకరించాలని ఉప్పల్ తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.
ఈ మేరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు), సూపర్వైజర్లు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను నమోదు చేయాలని సూచించారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 362 నుంచి 407 వరకు ఉన్న పోలింగ్ స్టేషన్ల పరిధిలో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఎల్ఓలు, సూపర్వైజర్లు తప్పనిసరిగా పాల్గొని, సేకరించిన వివరాలను సమగ్ర నివేదికగా కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, శనివారం తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్ పోలింగ్ స్టేషన్ నంబర్ 396 పరిధిలో పర్యటించి, ఓటర్ల జాబితాలను పరిశీలించారు.
ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా తెలుసుకుని, ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన వారి వివరాల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు . ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, జూనియర్ అసిస్టెంట్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.