జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ సోమవారం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారు, శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ ఆంజనేయస్వామి సహా సకల దేవతలు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణను పౌర్ణమి రోజున నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనే విశ్వాసంతో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
ఘాట్ రోడ్లోని శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. వేదమంత్రోచ్చారణలు, సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్యాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ ఘాట్ రోడ్, కుమ్మరిపాలెం, విద్యాధరపురం, పాలప్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణవీధి మీదుగా సాగి తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకుంది.
మార్గమధ్యంలో మహిళలు పసుపు నీటితో రహదారులను శుద్ధి చేసి హారతులు ఇచ్చి కొబ్బరికాయలు సమర్పించగా, దేవస్థానం భక్తులకు కుంకుమ, ప్రసాదం పంపిణీ చేసింది. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.