న్యూఢిల్లీ, జూలై 15: భారత్ మరియు బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) బుధవారం నుంచి అమల్లోకి రావడంతో బ్రిటన్లో తయారయ్యే కొన్ని లగ్జరీ కార్ల ధరలు భారత మార్కెట్లో గణనీయంగా తగ్గనున్నాయి. ఇప్పటి వరకు 110 శాతం వరకు ఉన్న దిగుమతి సుంకాన్ని 30 శాతానికి తగ్గించడంతో హైఎండ్ కార్ల కొనుగోలుదారులకు భారీ ఊరట లభించనుంది.
ఈ నిర్ణయంతో బ్రిటన్కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు రోల్స్-రాయిస్, ఆస్టన్ మార్టిన్, మెక్లారెన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి బ్రాండ్ల పూర్తిగా దిగుమతి అయ్యే వాహనాల ధరలు 20 నుంచి 25 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మోడల్ను బట్టి ఒక్కో వాహనంపై రూ.1 కోటి నుంచి రూ.3 కోట్ల వరకు ఆదా కావచ్చని భావిస్తున్నారు.
అయితే ఈ సుంక రాయితీ బ్రిటన్ నుంచి వచ్చే అన్ని వాహనాలకు వర్తించదు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టారిఫ్ రేట్ కోటా (టీఆర్క్యూ) పరిధిలో దిగుమతి అయ్యే కార్లకు మాత్రమే ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. తొలి ఏడాదిలో 10 వేల పూర్తిగా తయారైన పెట్రోల్ మరియు డీజిల్ కార్లకు ఈ రాయితీ వర్తించనుంది.
అదేవిధంగా, వచ్చే 15 సంవత్సరాల్లో ఈ కోటాను క్రమంగా పెంచడంతో పాటు దిగుమతి సుంకాన్ని కూడా దశలవారీగా 30 శాతం నుంచి 10 శాతానికి తగ్గించే ప్రణాళిక ఉంది.
దీంతో భవిష్యత్తులో బ్రిటిష్ లగ్జరీ కార్లకు భారత మార్కెట్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక బ్రిటన్లో తయారయ్యే ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రం ఈ రాయితీ వెంటనే వర్తించదు. ఒప్పందం అమల్లోకి వచ్చిన ఐదో సంవత్సరం నుంచి మాత్రమే ఈవీలపై తగ్గింపు సుంకాలు అమల్లోకి రానున్నాయి. దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ పరిశ్రమకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Sign in with Google to comment.