ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణం' చిత్రంపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం కేవలం సినిమా కాదని, భారతీయ సంస్కృతి, చరిత్ర, వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించే మహా ప్రయాణమని ఆమె పేర్కొంది.
ఢిల్లీలో జరిగిన 'రామాయణం' ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న రకుల్, ఈ భారీ ప్రాజెక్టులో భాగం కావడం తన జీవితంలో మరపురాని ఘట్టమని తెలిపింది. "ప్రపంచ వేదికపై భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న భావన మాటల్లో చెప్పలేనిది. ప్రేక్షకులు ఈ చిత్రంతో అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెడతారు" అని ఆమె తన పోస్టులో పేర్కొంది.
దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ భారీ పౌరాణిక చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో కనిపించనుంది. రావణాసురుడి సోదరిగా కథలో కీలక పాత్ర పోషించనున్న ఆమె లుక్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్తో భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Sign in with Google to comment.