ఉప్పల్ ప్రాంతంలో విద్యా రంగంలో సృజన స్కూల్ స్థాపనతోనే సరికొత్త మార్పు ప్రారంభమైందని ఉప్పల్ మాజీ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సృజన స్కూల్ వ్యవస్థాపకులు కీ.శే. రఘునందన్ రెడ్డి గారికే దక్కుతుందని అన్నారు.
ఉప్పల్లోని శిల్పారామంలో నిర్వహించిన సృజన హైస్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రజిత పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “విద్యను వ్యాపారంగా కాకుండా, సేవగా, చారిటీ భావంతో సృజన స్కూల్ను నడిపించారు” అని రఘునందన్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు. అలాగే, వారి కుటుంబ సభ్యులు కూడా అదే స్ఫూర్తితో విద్యాసేవను కొనసాగించాలని కోరారు.
సభలో మాట్లాడిన రజిత పరమేశ్వర్ రెడ్డి, “మత్తు వదలండి – మైదానానికి రండి, మత్తు వదలండి – చదువుతో సత్తా చాటండి” అనే నినాదం కేవలం మాటగా కాకుండా, రేపటి తరానికి మార్గదర్శకంగా మారాలని ఆకాంక్షించారు. ఆమె ప్రసంగం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఆలోచింపజేసేలా సాగింది.
చిన్నప్పటి నుంచే విలువలతో కూడిన విద్య అవసరం” “మొక్కై వంగనిది మానై వంగునా” అనే సామెతను ప్రస్తావిస్తూ, పిల్లలకు చిన్నప్పటి నుంచే విలువలతో కూడిన విద్య, క్రమశిక్షణ, బాధ్యతా భావం నేర్పించాలని రజిత పరమేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు కేవలం ఫీజులు కట్టడమే కాకుండా, పిల్లలతో సమయం గడపాలని వారి స్నేహితుల వర్గాన్ని గమనించాలని వారి ప్రవర్తనపై శ్రద్ధ పెట్టాలని సూచించారు
పాఠశాలలు దేవాలయాలు.. ఉపాధ్యాయులు మార్గదర్శులు” ఉపాధ్యాయులు పిల్లల శ్రేయస్సు కోసం క్రమశిక్షణను పాటింపజేస్తే, దానిని తప్పుగా అర్థం చేసుకునే ధోరణి మారాలని ఆమె అభిప్రాయపడ్డారు. తన చిన్ననాటి అనుభవాన్ని గుర్తు చేస్తూ, “ఉపాధ్యాయుల క్రమశిక్షణే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది” అని పేర్కొన్నారు. పాఠశాలలను దేవాలయాలుగా భావించి, అంకితభావంతో చదివితేనే విద్యార్థులు ఉన్నత భవిష్యత్తును సాధించగలరని తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేస్తేనే విద్యార్థి దశలో మార్పు వచ్చి, మంచి సమాజం నిర్మితమవుతుందని అన్నారు.
Comments
Sign in with Google to comment.