నాగార్జునసాగర్: తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం నాగార్జునసాగర్లో భక్తిశ్రద్ధల మధ్య శాస్త్రోక్తంగా ముగిసింది. విజయ్ విహారం వద్ద కృష్ణా నది తీరంలో నిర్వహించిన ఈ యాగంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని వేదపండితుల మార్గదర్శకత్వంలో వైదిక క్రతువులు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో, 11 హోమగుండాలతో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక హోమక్రతువులు నిర్వహించారు. మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండాలని, ప్రతి చెరువు, కుంటలో జలకళ కనిపించాలని ఆకాంక్షించారు. భూగర్భ జలాలు పెరిగి పంటలు సమృద్ధిగా పండాలని, రైతుల ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరియాలని ఆయన కోరుకున్నారు.
ప్రజల సుఖసంతోషాలు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా వరుణయాగాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. భారతీయ సంస్కృతిలో వర్షాలు, వ్యవసాయం, ప్రకృతి, మానవ జీవితం మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోందని పేర్కొంది. శాస్త్రీయ అంచనాలు, ముందస్తు ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తూనే సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రకృతి అనుగ్రహాన్ని కోరినట్లు వివరించింది.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, పి. సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.