ఇంద్రకీలాద్రిలో భక్తుల సౌకర్యాలు, పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధిపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సమీక్ష నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో కలిసి శుక్రవారం మహా మండపం నాలుగో అంతస్తులో ఇంజినీరింగ్, శానిటేషన్ మరియు ఇతర ప్రధాన విభాగాల అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సమీక్షలో భాగంగా దుర్గా ఘాట్ స్నానాల రేవు నుంచి కనకదుర్గ నగర్, ఘాట్ రోడ్డు, మహా మండపం సహా ఆలయ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఈవో ఆదేశించారు. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘాట్ రోడ్డు టోల్ గేట్ నుంచి ‘ఓం’ టర్నింగ్ వరకు రోడ్డు బలోపేత పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పనుల కారణంగా కొద్ది రోజుల పాటు ఘాట్ రోడ్డును మూసివేసే అవకాశం ఉన్నందున, భక్తులకు ఇబ్బందులు కలగకుండా కనకదుర్గ నగర్లో ప్రత్యామ్నాయ మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని సూచించారు. ఇంజినీరింగ్ అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షించాలని ఈవో స్పష్టం చేశారు. ఏఈలు, డీఈలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. భక్తులకు అందించే అన్నప్రసాదాల నాణ్యతను మరింత మెరుగుపరచాలని, పరిశుభ్రతతో పాటు రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో భక్తులకు నిరంతర తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించడమే ప్రధాన లక్ష్యంగా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఈవో శీనా నాయక్ ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇంజినీరింగ్ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.