రామంతపూర్ భగాయత్ లోని వెంకట సాయి నగర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను తక్షణమే మంజూరు చేయాలని కోరుతూ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు విజయేందర్ రెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్కు వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీసీ రోడ్ల మంజూరు కోసం అందించిన సిఫార్సు లేఖలను కమిషనర్కు అందజేశారు. కాలనీలో తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రస్తుతం సీసీ రోడ్ల నిర్మాణమే అత్యవసర అవసరంగా మారిందని విజయేందర్ రెడ్డి వివరించారు.
వర్షాకాలంలో బురద, నీటి నిల్వలు, దుమ్ము కారణంగా కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు నిత్య రాకపోకల్లో తీవ్ర అవస్థలు పడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వినతిపై స్పందించిన కమిషనర్ శ్రీ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్ ప్రతిపాదనలను పరిశీలించి, నిబంధనల ప్రకారం అవసరమైన పరిపాలనా చర్యలు చేపట్టి వెంకట సాయి నగర్ కాలనీకి సీసీ రోడ్ల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాధిక గుప్త, ఐఏఎస్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వెంకట సాయి నగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ కమిటీ సభ్యులు, స్థానిక నివాసితులు పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.