ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు వైరస్ బారినపడి మంగళవారం మృతి చెందడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
మృతుల్లో ఒకరు 43 ఏళ్ల వ్యక్తి కాగా, మరొకరు 60 ఏళ్లు పైబడిన వృద్ధుడిగా అధికారులు గుర్తించారు. ఇద్దరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలినట్లు సమాచారం. 43 ఏళ్ల వ్యక్తి కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, 60 ఏళ్లు పైబడిన మరో వ్యక్తి తమిళనాడులోని సీఎంసీ వెల్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
అయితే, తుది నిర్ధారణ కోసం మృతుల బ్లడ్ శాంపిళ్లను పుణెలోని వైరాలజీ ల్యాబ్కు పంపేందుకు కడప జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. నివేదికలు వచ్చిన తర్వాతే వీరి మరణాలకు కరోనా వైరస్నే కారణమా అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇద్దరి మరణాలతో జిల్లాలో మళ్లీ కరోనా భయాందోళనలు మొదలయ్యాయి. ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తుండగా, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Sign in with Google to comment.