ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని లో బుధవారం శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఆరుద్రోత్సవాలలో భాగంగా వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
స్వర్ణరథోత్సవానికి ముందు ఆలయ అర్చకులు లోకకల్యాణార్థం ప్రత్యేక సంకల్పం చేశారు. దేశంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని, అతివృష్టి–అనావృష్టులు నివారించబడాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పుష్కలంగా పండాలని ప్రార్థించారు.
ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలిగి అకాల మరణాలు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు వంటి అనర్థాలు సంభవించకుండా ఉండాలని దేవతలను వేడుకున్నారు. వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల శివనామస్మరణల నడుమ ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన స్వర్ణరథోత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు ఘనంగా కొనసాగింది.
రథోత్సవంలో కోలాటం, తప్పెట చిందులు వంటి జానపద కళారూపాలతో పాటు సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు దంపతులు, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, అర్చకస్వాములు, వివిధ విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.