శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో నిర్వహించిన ఉగాది మహోత్సవాలు పూర్ణాహుతి, వసంతోత్సవం, అవభృథం, త్రిశూలస్నానం కార్యక్రమాలతో వైభవంగా ముగిశాయి. మహోత్సవాల చివరి రోజున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించగా, యాగశాలలో చండీశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు జరిపించారు.
అనంతరం లోకకల్యాణం కోసం జపాలు, నిత్యహోమాలు, బలిహరణలు నిర్వహించారు. పూర్ణాహుతి శాస్త్రోక్తంగా నారికేళాలు, సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, పగడాలు, నూతన వస్త్రాలు తదితర ద్రవ్యాలను హోమగుండంలో ఆహుతిగా సమర్పించి యాగకార్యక్రమాన్ని పూర్తి చేశారు. వసంతోత్సవం పూర్ణాహుతి అనంతరం వసంతోత్సవం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పసుపు, సున్నం, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మంత్రపూరిత జలాన్ని భక్తులపై ప్రోక్షించారు. అవభృథం – త్రిశూలస్నానం వసంతోత్సవం అనంతరం చండీశ్వరస్వామివారిని ఆలయ ప్రదక్షిణతో మల్లికాగుండం వద్దకు తీసుకెళ్లి అవభృథం నిర్వహించారు.
శుద్ధజలం, పంచామృతాలు, భస్మోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, సుగంధోదకం, బిల్వోదకం, పుష్పోదకం, నారికేళోదకం తదితరాలతో స్నపన కార్యక్రమం నిర్వహించారు. తదుపరి త్రిశూలస్నానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సమయంలో మల్లికాగుండ జలాన్ని తలపై ప్రోక్షించుకోవడం ద్వారా పాపాలు నశించి శ్రేయస్సు కలుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.
ఈ కార్యక్రమాలలో కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.
Comments
Sign in with Google to comment.