శ్రీశైల దేవస్థానం చెంచు గిరిజన భక్తుల కోసం ప్రతి నెలా ఒకరోజు ఉచిత స్పర్శదర్శనం కల్పించే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఈ ప్రత్యేక దర్శన విధానాన్ని గతంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రారంభించగా, ప్రస్తుతం ప్రతి నెల చివరి బుధవారం రోజున చెంచు భక్తులకు ఈ సౌకర్యం అందిస్తున్నారు.
ఈ క్రమంలో మార్చి 25, 2026న చెంచు గిరిజన భక్తులు శ్రీ మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శనంను ఉచితంగా పొందారు. అదే సమయంలో వారు భ్రమరాంబ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన చెంచు గిరిజనులకు దేవస్థానం తరఫున ఉచిత వసతి, అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పించబడినట్లు అధికారులు తెలిపారు. దర్శనం అనంతరం భక్తులందరికీ అన్నపూర్ణా ప్రసాదవితరణ భవనంలో అన్నప్రసాదాలు కూడా అందజేశారు. ఈ రోజు ఉదయం చెంచు గిరిజన భక్తులు తప్పెట వాయిద్యాలు, సాంప్రదాయ చెంచు నృత్యాలతో భక్తి వాతావరణంలో ఆలయానికి చేరుకున్నారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థానం అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు మాట్లాడుతూ, తాము బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్థానిక మేకలబండ చెంచుగూడెంను సందర్శించినప్పుడు, చెంచు భక్తులు స్వామివారి స్పర్శదర్శనం కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఆ అభ్యర్థన మేరకు ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేసి, ప్రతి నెల ఒకరోజు ఈ ప్రత్యేక ఉచిత దర్శనం అందించేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ, చెంచు గిరిజనులు శ్రీ భ్రమరాంబాదేవిని తమ కూతురిగా, శ్రీ మల్లికార్జున స్వామిని తమ అల్లుడిగా భావించే ఆధ్యాత్మిక అనుబంధం కలిగి ఉన్నారని తెలిపారు. దేవస్థాన ఉత్సవాల్లో, ముఖ్యంగా గ్రామోత్సవం సమయంలో చెంచుల సంప్రదాయ నృత్యాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో కూడా దివ్య కల్యాణ మహోత్సవానికి చెంచు భక్తులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఉచిత స్పర్శదర్శనానికి భక్తుల ఎంపికలో స్థానిక ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సహకారం తీసుకుంటున్నామని తెలిపారు.
Comments
Sign in with Google to comment.