లోవ గ్రామంలో వెలసిన శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీ సగిలి షణ్మోహన్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆలయంలో నిర్మాణంలో ఉన్న నూతన ఘాట్ రోడ్డు పనులు, ఘాట్ రోడ్ దిగువ నుంచి రోడ్డు విస్తరణ పనులు, అలాగే ఇప్పటికే పూర్తైన రాజగోపురం మరియు మహా మండపం నిర్మాణ పనుల పురోగతిపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి కలెక్టర్కు వివరించారు. జరిగిన మరియు కొనసాగుతున్న అభివృద్ధి పనుల వ్యయ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను కూడా ఆయనకు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్కు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు, అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం కలెక్టర్కు అమ్మవారి శేషవస్త్రం, జ్ఞాపిక అందజేయగా, వేదపండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయంలో దర్శనాలు, ప్రసాదాలు, వసతి తదితర సేవలను సులభంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ సేవలు, మన మిత్ర, ఏపీ టెంపుల్స్ యాప్ వంటి సాంకేతిక సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా కరూర్ వైశ్యా బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యూయాస్క్ మిషన్లను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. భక్తులు ప్రభుత్వం అభివృద్ధి చేసిన సాంకేతిక వసతులను వినియోగించుకుని ఆలయ సేవలను మరింత సులభంగా పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ, ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ కవర్లు, కాగితం, నారా ఉత్పత్తులు వంటి పర్యావరణ హిత వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఈ విషయంపై భక్తుల్లో మరింత అవగాహన కల్పించి, ఆచరణలోకి తీసుకురావాలని దేవస్థానం అధికారులకు ఆదేశించారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు జిల్లా కలెక్టర్ కార్యనిర్వహణాధికారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ ఇంజనీర్, తుని మండల తహసీల్దార్, పంచాయతీరాజ్ శాఖ డి.డి.ఇ., రెవెన్యూ సిబ్బంది, కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ మరియు సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.