ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లి చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు మంగళవారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు.
తెలంగాణ కారాగార & సంస్కరణ సేవల శాఖ, HYDRAA, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ కారాగార శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా, ఐపీఎస్తో కలిసి ఆయన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, చర్లపల్లి చెరువు పునరుద్ధరణతో పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, జీవ వైవిధ్య సంరక్షణకు తోడ్పాటుతో పాటు స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ప్రభుత్వ శాఖలు, సంస్థల సమన్వయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు నగరాభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కారాగార శాఖ, HYDRAA, IOCL అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.