మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కీలక అభివృద్ధి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు.
తార్నాకలోని ఎంఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏఓసీ ప్రాజెక్టు భూసేకరణ, టీకేఆర్ ఫ్లైఓవర్, ఆర్కే పురం ఆర్ఓబీ, ఉప్పల్ ఫ్లైఓవర్తో పాటు ఇతర పెండింగ్ పనుల పురోగతిని సమీక్షించారు. ఏఓసీ ప్రాజెక్టుకు సంబంధించి రక్షణ శాఖ భూమికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల బదిలీ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్కు వెంటనే లేఖ పంపాలని అధికారులను ఆదేశించారు.
అలాగే రైల్వే భూముల సేకరణ, భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఎంఎంసీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్పై రెండు రోజుల్లో కన్సల్టెంట్తో సమావేశం నిర్వహించాలని ఆదేశించిన కమిషనర్, టీకేఆర్ ఫ్లైఓవర్ నిర్మాణంతో ప్రభావితమయ్యే భవన యజమానులతో సమావేశమై టిడిఆర్ విధానంపై చర్చించారు. పలువురు యజమానులు టిడిఆర్ స్వీకరించేందుకు అంగీకరించగా, వారికి టిడిఆర్ జారీ ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్కే పురం ఆర్ఓబీ పనులకు సంబంధించి 34 మంది ఆస్తి యజమానులు టిడిఆర్కు అంగీకరించారని, వారికి త్వరలోనే టిడిఆర్ జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఉప్పల్ ఫ్లైఓవర్ మిగిలిన ఫౌండేషన్ పనులు, రామంతాపూర్ వైపు భూసేకరణను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.
Comments
Sign in with Google to comment.