హైదరాబాద్ | ఆగస్టు 14:
తెలంగాణలో విద్య, సామాజిక న్యాయం, ఉపాధి అవకాశాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో ఆయన ప్రభుత్వ విధానాలను వివరించారు. “చదువు ఒక్కటే పరిష్కారం.. అదే మార్గం.. తెలంగాణను ప్రపంచ పటంలో పెట్టడానికి విద్యే మార్గం” అని సీఎం స్పష్టం చేశారు.
ఫూలే దంపతుల స్ఫూర్తితో విద్యకు పెద్దపీట
150 ఏళ్ల క్రితమే జ్యోతిబా ఫూలే విద్య ఒక్కటే మార్గమని చాటి చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. తాను చదువుకోవడంతో పాటు తన భార్య సావిత్రిబాయి ఫూలేను చదివించి ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. వారి ఆలోచనల స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతోందన్నారు. విద్య ఆత్మగౌరవాన్ని, గుర్తింపును ఇస్తుందని.. మనిషి తలెత్తుకుని జీవించేలా చేస్తుందని వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్మెంట్పై కీలక ప్రకటన పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఫీజుల భారం లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి సుమారు రూ.2,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ను అడ్వాన్స్గా చెల్లించే విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నెలలోనే ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల ఖాతాల్లో జమయ్యేలా పారదర్శక వ్యవస్థను తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో ఏ కాలేజీ కూడా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపే పరిస్థితి లేకుండా ముందుగానే ఫీజులు చెల్లిస్తామని స్పష్టం చేశారు.
సర్టిఫికెట్ కాదు.. స్కిల్ ఉంటేనే ఉద్యోగం
కేవలం డిగ్రీ లేదా సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి అన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతో పాటు విద్యార్థులకు నైపుణ్యాలను అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకుంటేనే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలరని సూచించారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో నర్సింగ్, సాంకేతిక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
119 నియోజకవర్గాల్లో ATCలు.. యువతకు స్కిల్స్ 2024లో టాటా సంస్థతో కలిసి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. వీటిలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రూ.2,000 స్టైఫండ్ ఇస్తున్నామని చెప్పారు. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
119 నియోజకవర్గాల్లో ATCలు..
యువతకు స్కిల్స్ 2024లో టాటా సంస్థతో కలిసి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. వీటిలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రూ.2,000 స్టైఫండ్ ఇస్తున్నామని చెప్పారు. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
క్రీడల్లో రాణిస్తే ఉద్యోగాలు
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించే వారికి నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదేనన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు.
బీసీ జనగణనపై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
బీసీలకు రాజ్యాధికారంలో తగిన వాటా కల్పించాలంటే వారి జనాభా లెక్కలు స్పష్టంగా ఉండాలని సీఎం అన్నారు. దేశంలో బీసీ జనగణనకు ఎవరూ ధైర్యం చేయలేదని.. తమ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీల లెక్క తేల్చిందన్నారు. బలహీన వర్గాలకు ఉద్యోగాలు, అవకాశాలు కల్పించాలంటే వారి జనాభా ఆధారంగా విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
“గొర్రెలు, బర్రెలు కాసుకోవడమేనా?”
గత ప్రభుత్వ విధానాలపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీసీ వర్గాల పిల్లలు కేవలం గొర్రెలు, బర్రెలు పెంచుకోవడం, చెప్పులు కుట్టడం, చేపలు పట్టడానికే పరిమితం కావాలా అని ప్రశ్నించారు. “బీసీల పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు కావొద్దా?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదువు మాత్రమే తలరాతలను మార్చగలదని.. సామాజిక మార్పుకు విద్యే ప్రధాన ఆయుధమని అన్నారు.
తెలంగాణ యువత బంగారు భవిష్యత్తు కోసం తాను రోజుకు 18 గంటలు పనిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఫూలే దంపతుల స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని.. డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
చివరగా “ఇంత మంచి అవకాశం మళ్లీ రాదు.. ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాలి” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. విద్య, సామాజిక న్యాయం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలే తెలంగాణ భవిష్యత్తును మార్చే మార్గాలని ఆయన స్పష్టం చేశారు.
Comments
Sign in with Google to comment.