హైదరాబాద్ | ఆగస్టు 15, 2026
ఆంగ్లేయుల పాలనలో జరిగిన దారుణాలు, భారత సమాజాన్ని విభజించేందుకు బ్రిటిష్ పాలకులు అనుసరించిన ‘విభజించి పాలించే’ కుట్రలను నేటి తరం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. చరిత్రను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే దేశ భవిష్యత్తును మరింత బలంగా నిర్మించగలమని ఆమె స్పష్టం చేశారు.
తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రిటిష్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండు ప్రపంచ యుద్ధాల్లో భారతీయ సైనికులను బలవంతంగా వినియోగించి వేలాది మంది ప్రాణాలను బలితీసుకున్నారని ఆమె ఆరోపించారు.
బ్రిటిష్ పాలకుల విధానాల వల్ల భారత సమాజంలో కుల విభజనలు మరింత తీవ్రమయ్యాయని కవిత విమర్శించారు. అడవుల్లో తమ సంప్రదాయ జీవన విధానంతో ప్రశాంతంగా జీవిస్తున్న ఆదివాసీలను పాలనా వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చి తీవ్ర అన్యాయం చేశారని అన్నారు.
బ్రిటిషర్లు వెళ్లినా.. ‘గులాంగిరీ’ ఇంకా ఎందుకు?
బ్రిటిష్ పాలకులు దేశం విడిచి వెళ్లినా వారి ఆలోచనా విధానం మాత్రం పూర్తిగా పోకపోవడం బాధాకరమని కవిత అన్నారు. ఇంగ్లీష్ మాట్లాడేవారినే గొప్పవారిగా భావిస్తూ, మాతృభాష తెలుగు మాట్లాడేవారిని తక్కువగా చూడటం ఇప్పటికీ కొనసాగడం ఆనాటి బానిస మనస్తత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
చర్మం రంగు, భాష, కులం ఆధారంగా మనుషుల మధ్య తేడాలు సృష్టించే మైండ్సెట్ను విడిచిపెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక ఐక్యతతో ముందుకు సాగాలని కవిత అన్నారు.
“దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ మన ఆలోచనలకు కూడా సంపూర్ణ స్వాతంత్ర్యం రావాలి” అనే సందేశంతో ఆమె ప్రసంగం సాగింది.
Comments
Sign in with Google to comment.