న్యూఢిల్లీ, జూలై 26: ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) విధానానికి వ్యతిరేకంగా ఢిల్లీ ట్యాక్సీ, పర్యాటక, టూర్ ఆపరేటర్ల సంఘం కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది. ఆగస్టు 4న పార్లమెంట్ వరకు భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు సంఘం ప్రకటించింది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోవడం, ఇంజిన్ పనితీరు దెబ్బతినడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి సమస్యలను దేశవ్యాప్తంగా రవాణా రంగానికి చెందినవారు ఎదుర్కొంటున్నారని సంఘం ఆరోపించింది.
ట్రాన్స్పోర్టర్స్ సంఘం అధ్యక్షుడు సంజయ్ సామ్రాట్ మాట్లాడుతూ, "ప్రజలు పూర్తి ధర చెల్లించి పెట్రోల్ కొనుగోలు చేస్తున్నప్పుడు, ఎందుకు ఇథనాల్ కలిపిన ఇంధనం మాత్రమే అందిస్తున్నారు? కేంద్రం ఇంధన ధరలు పెంచుతూనే నాణ్యతపై ప్రశ్నలు తలెత్తే పరిస్థితిని ఎందుకు సృష్టిస్తోంది?" అని ప్రశ్నించారు.
ఇథనాల్ 20 విధానం అమలులోకి వచ్చిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వాహన యజమానులు ఇంధన సామర్థ్యం తగ్గిందని, వాహనాల నిర్వహణ ఖర్చులు పెరిగాయని ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ విధానాన్ని పునఃసమీక్షించి, వాహనదారుల ఆందోళనలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆగస్టు 4న జరిగే పాదయాత్రలో దేశవ్యాప్తంగా ట్యాక్సీ డ్రైవర్లు, టూర్ ఆపరేటర్లు, ట్రాన్స్పోర్ట్ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆందోళనతో ఇథనాల్ మిశ్రమ పెట్రోల్పై జాతీయ స్థాయిలో మరోసారి చర్చ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Sign in with Google to comment.