అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉప్పల్లోని శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్కు చెందిన వివిధ విభాగాల మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి మాట్లాడుతూ, సమాజంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పట్టుదల, అంకితభావంతో మహిళలు ప్రతి రంగంలో విజయాలు సాధించగలరని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహిళలు అనేక రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు సాగుతూ నాయకత్వ బాధ్యతలు చేపడుతున్నారని అన్నారు. మహిళలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో ముఖ్య భాగమని పేర్కొన్న ఆయన, మహిళా పోలీస్ సిబ్బంది తమ విధులను ధైర్యం, నిబద్ధతతో నిర్వర్తించాలని ప్రోత్సహించారు.
కుటుంబ బాధ్యతలతో పాటు వృత్తిపరమైన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న మహిళా పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లో మహిళా సిబ్బంది లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మహిళా భద్రత వంటి విభాగాల్లో సమర్థంగా సేవలందిస్తున్నారని తెలిపారు. గృహ హింస వంటి సమస్యలతో బాధపడుతున్న బాధితులకు కౌన్సెలింగ్ అందిస్తూ సమాజానికి సేవ చేస్తున్నారని వారు అన్నారు.
Comments
Sign in with Google to comment.