రాబోయే రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండటంతో పాటు రాష్ట్ర ప్రగతికి దిక్సూచిగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భట్టి విక్రమార్క పంచాంగ శ్రవణం వీక్షించి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ‘పరాభవ’ నామ సంవత్సరంలో దుష్టశక్తులకు పరాభవం కలగాలని, రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రంగాలు వేగంగా అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని చెప్పారు. ప్రతి కుటుంబం ఉగాది పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన పార్టీ శ్రేణులను భట్టి విక్రమార్క అభినందించారు.
Comments
Sign in with Google to comment.