దక్షిణ మధ్య రైల్వే (SCR) తన చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా అత్యధిక సరుకు రవాణా లోడింగ్ను నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో మార్చి 24, 2026 వరకు మొత్తం 144.244 మిలియన్ టన్నుల సరుకు రవాణా సాధించి అత్యుత్తమ పనితీరును ప్రదర్శించింది.
ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా వారం రోజుల సమయం ఉండగానే ఈ ఘనతను అందుకోవడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం 2024–25లో నమోదైన 144.14 మిలియన్ టన్నుల అత్యుత్తమ లోడింగ్ను ఈసారి దక్షిణ మధ్య రైల్వే అధిగమించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ కర్మాగారాలు సరుకు రవాణా వృద్ధికి ప్రధానంగా దోహదపడ్డాయి. ముఖ్యంగా బొగ్గు, సిమెంట్ రవాణాలో జోన్ పటిష్టమైన స్థాయిని కొనసాగించడంతో పాటు, కొత్త రకాల సరుకులను కూడా రవాణా వ్యవస్థలో చేర్చి ఆదాయ వనరులను విస్తరించింది.
ప్రధాన సరుకు రవాణా వివరాలు ఇలా ఉన్నాయి: బొగ్గు – 66.878 మిలియన్ టన్నులు సిమెంట్ – 37.572 మిలియన్ టన్నులు ఇనుప ఖనిజం – 8.620 మిలియన్ టన్నులు ఎరువులు – 8.038 మిలియన్ టన్నులు ఉక్కు కర్మాగారాలకు ముడి పదార్థాలు – 4.810 మిలియన్ టన్నులు ఆహార ధాన్యాలు – 6.225 మిలియన్ టన్నులు కంటైనర్లు – 2.561 మిలియన్ టన్నులు పెట్రోలియం ఉత్పత్తులు – 1.223 మిలియన్ టన్నులు ఇతర వస్తువులు – 8.349 మిలియన్ టన్నులు
దక్షిణ మధ్య రైల్వే అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి, విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం వల్లే ఈ రికార్డు సాధ్యమైందని అధికారులు తెలిపారు. సరుకు రవాణా వినియోగదారులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల మెరుగుదల, టెర్మినల్స్లో పని వాతావరణం అభివృద్ధి, గూడ్స్ షెడ్ల విస్తరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అదనంగా, వినియోగదారుల అవసరాలను సమయానుకూలంగా పరిష్కరించేందుకు అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. సాంప్రదాయ సరుకులతో పాటు కొత్త సరుకులను గుర్తించి, పోర్ట్ లోడింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా ఈ రికార్డు సాధనలో కీలకంగా నిలిచింది.
Comments
Sign in with Google to comment.