విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిసన్, ఇన్-హౌస్, పీస్ రేట్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈ జేఏసీ) ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికులు హబ్సిగూడ డీఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 8న నాంపల్లిలో భారీ కార్మిక సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అదే రోజు ఉదయం 9 గంటలకు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిసన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని, ఆర్టిసన్ మరియు ఇన్-హౌస్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ ప్రకారం ఓఎం సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్ సంస్థల్లో ఇన్-హౌస్ వర్కర్లకు అధికారిక గుర్తింపు, పూర్తి స్థాయి ఉద్యోగ హోదా కల్పించాలని కోరారు. అదేవిధంగా 2016 డిసెంబర్ 4కు ముందు విధుల్లో చేరిన కార్మికులకు బ్యాచ్ల వారీగా కాంట్రాక్ట్ అవకాశాలు ఇవ్వాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో నెం.11 ప్రకారం కనీస వేతనం చెల్లించాలని, 2026 పీఆర్సీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మార్చి 26 నుంచి 30 వరకు డివిజన్ కార్యాలయాల వద్ద ధర్నాలు, ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల వద్ద నిరసనలు, ఏప్రిల్ 4న కేటీపీఎస్ వద్ద కార్యక్రమం, ఏప్రిల్ 7న టీజీఎన్పీడీసీఎల్ హెడ్ ఆఫీస్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హబ్సిగూడ సర్కిల్ జేఏసీ చైర్మన్ సిహెచ్ వెంకటరెడ్డి, కన్వీనర్ బి. రవి, జేఏసీ నాయకుడు కె. బాబు, బి. శ్రీను, కె. శ్రీరాములు, శ్రీనివాసులు, అహ్మద్, సంతోష్, అజీమ్, నరసింహులు, సంగీత, మాధవి, శివ, బాలు, అశోక్, రాజేందర్ నాయక్, భరత్, ఎండి రఫీ, మల్లారెడ్డి, బౌరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.