ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. తొలి తేదీకే జీతాలు జమ
హైదరాబాద్, జూలై 2: తెలంగాణ ప్రభుత్వం ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, హానరేరియం ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి A. Revanth Reddy ఇచ్చిన హామీ మేరకు ఈ నెల తొలి తేదీకే ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం విడుదల చేసింది.
ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి జీతాలు బుధవారం వారి ఖాతాల్లో జమయ్యాయి.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముందస్తు చర్యలు తీసుకుని జీతాల విడుదల ప్రక్రియను పూర్తి చేసింది. జీతాల చెల్లింపులో తరచూ జరుగుతున్న ఆలస్యంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నారు.
రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, హానరేరియం సిబ్బందికి కూడా ప్రతి నెలా ఆలస్యం లేకుండా జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసి, ప్రతి నెల 25వ తేదీలోగా జీతాల బిల్లులు ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలకు సమర్పించాలని, నెలాఖరు నాటికి పరిశీలన, ఆడిట్, ఆథరైజేషన్ పూర్తి చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ నెల బిల్లులు అందిన అన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు విజయవంతంగా జమ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.
Comments
Sign in with Google to comment.