ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొల్లపూడిలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో 22 ప్రముఖ దేవాలయాల ఎగ్జిక్యూటివ్ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ఆలయాల్లో ఆన్లైన్ సేవలను విస్తరించాలని డాక్టర్ ఎం హరి జవహర్లాల్ అధికారులను ఆదేశించారు.
కాలానుగుణ అవసరాలకు అనుగుణంగా కొత్త ఆర్జిత సేవలను ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కే రామచంద్ర మోహన్ ఆలయాల్లో ‘జీరో వేస్ట్ డిస్పోజల్ పాలసీ’ను సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. ఆలయాల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను డంపింగ్ యార్డులకు తరలించకుండా పర్యావరణహిత పద్ధతుల్లో నిర్వహించాలని సూచించారు.
అదేవిధంగా ప్రతి దేవాలయంలో రూఫ్టాప్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు, బయోగ్యాస్ యూనిట్లు, పైప్డ్ గ్యాస్ సదుపాయాలు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఒక దేవాలయంలో విజయవంతంగా అమలవుతున్న ఉత్తమ విధానాలను రాష్ట్రంలోని ఇతర ఆలయాల్లో కూడా అమలు చేయాలని కమిషనర్ పేర్కొన్నారు. సేవకుల ద్వారా ఆన్లైన్ సేవలు, సోషల్ మీడియా ప్రచారం, ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణ చేపట్టాలని సూచించారు. సమావేశంలో విజయవాడ, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం తదితర ప్రముఖ దేవాలయాల అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులు వివరాలు వెల్లడించారు.
Comments
Sign in with Google to comment.