తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy యాదగిరిగుట్ట పర్యటనలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సీఎం హెలికాప్టర్ నిర్ణయించిన హెలిప్యాడ్కు బదులుగా వేరే ప్రదేశంలో ల్యాండ్ కావడం, అక్కడ సరైన భద్రతా సిబ్బంది లేకపోవడం, అధికారులు సమయానికి అందుబాటులో లేకపోవడం భద్రతా వ్యవస్థపై అనుమానాలు పెంచుతోంది. ఈ ఘటన కేవలం ప్రోటోకాల్ లోపమే కాకుండా రాష్ట్ర ఇంటెలిజెన్స్ మరియు సెక్యూరిటీ వ్యవస్థ వైఫల్యమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మే 23న యాదగిరిగుట్టలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయాల్సి ఉండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా కనిపించాయని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు దాదాపు 15 నిమిషాల పాటు హెలికాప్టర్లోనే వేచి ఉండాల్సి రావడం భద్రతా వ్యవస్థలోని లోపాలను బయటపెట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జెడ్ కేటగిరీ వీఐపీ భద్రతను పర్యవేక్షించే స్టేట్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ముందస్తుగా హెలిప్యాడ్ భద్రత, ల్యాండింగ్ పరిస్థితులు, జనసంచారం, ఎమర్జెన్సీ రూట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే యాదగిరిగుట్ట ఘటనలో ఆ సమన్వయం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ల్యాండింగ్ను నిలిపివేయడం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సాధారణ ప్రక్రియ అయినప్పటికీ, ఈ ఘటనలో అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి.
ఇక తెలంగాణ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగ పనితీరుపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విభాగానికి రిటైర్డ్ అధికారిని బాధ్యతలు అప్పగించారని, ఆరోగ్య సమస్యల కారణంగా కీలక సమయాల్లో సమర్థ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెక్యూరిటీ సిబ్బందిపై అమలు చేస్తున్న కఠిన ఫిట్నెస్ నిబంధనలు కూడా శాఖలో అసంతృప్తికి కారణమైనట్లు సమాచారం. 50 ఏళ్లు దాటిన సిబ్బందిని కూడా నిర్దిష్ట సమయంలో పరుగు పరీక్షలకు హాజరు కావాలని ఆదేశించడం వివాదాస్పదమైంది. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక అనుభవజ్ఞులైన పలువురు సిబ్బంది ఇతర శాఖలకు బదిలీపై వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదికలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. హెలికాప్టర్ మార్గం ఎందుకు మార్చాల్సి వచ్చింది..? తుది ల్యాండింగ్ నిర్ణయం ఎవరు తీసుకున్నారు..? భద్రతా వ్యవస్థ ఎందుకు విఫలమైంది..? వంటి అంశాలపై లోతైన విచారణ కొనసాగుతోంది. అధికారులు పరస్పరం బాధ్యతలు నెట్టేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శల మధ్య, యాదగిరిగుట్ట ఘటన తెలంగాణ భద్రతా వ్యవస్థలోని బలహీనతలను బయటపెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Sign in with Google to comment.