విజయవాడ డివిజన్లోని రాయనపాడు రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ ఏడీఆర్ఎం ఎడ్విన్ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్లో పెరుగుతున్న రద్దీని తగ్గించడమే ఈ స్టేషన్ ఎంపిక వెనుక ప్రధాన ఉద్దేశమని చెప్పారు. భవిష్యత్తులో కొన్ని రైళ్లు విజయవాడలో ఆగకుండా రాయనపాడు మార్గంగా సికింద్రాబాద్ మరియు ఇతర గమ్యస్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జాతీయ రహదారికి సమీపంలో ఉండటం, పరిసర ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతుండటం వల్ల ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. సమీపంలోని కొండపల్లి వంటి చారిత్రాత్మక ప్రాంతం ఉండటం వల్ల కూడా ఈ స్టేషన్కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందన్నారు.
విజయవాడ నగరానికి కొంత దూరంలో స్టేషన్ను అభివృద్ధి చేయడం ద్వారా రద్దీ తగ్గడంతో పాటు సమీప ప్రాంతాల ప్రజలకు రైల్వే సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ స్టేషన్లో విమానాశ్రయాల తరహాలో ఆధునిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఏసీ లాంజ్లు, తాగునీటి సదుపాయం, టికెట్ బుకింగ్ కౌంటర్లు, సౌకర్యవంతమైన కూర్చునే ఏర్పాట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దివ్యాంగులకు అనుకూలంగా స్టేషన్ను పూర్తిగా రూపొందించామని తెలిపారు. ప్రయాణికులు స్టేషన్లోకి ప్రవేశించినప్పుడు ఆధునికమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని అనుభవిస్తారని పేర్కొంటూ, ఈ సదుపాయాలను తమవిగా భావించి పరిశుభ్రతను కాపాడాలని అధికారులు కోరారు.
Comments
Sign in with Google to comment.