ఆదివారం సెలవు దినం కావడంతో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే భక్తుల రాక గణనీయంగా పెరగడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ఏఈవోలు చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రమేష్లు క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.
రద్దీ అధికంగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీంతో క్యూ లైన్లలో వేచి ఉన్న సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం వేగవంతంగా, సులభంగా లభించింది. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ యంత్రాంగం సరికొత్త నీటి సరఫరా విధానాన్ని అమలు చేసింది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని అందించారు.
ఈ వినూత్న ఏర్పాటుకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఎండలో నిలబడి ఉన్న తమకు లైన్లలోనే తాగునీరు అందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆలయ పరిసరాల్లో ఉచిత ప్రసాదం, అన్నదాన కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహించారు.
మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తుల రద్దీ క్రమంగా తగ్గింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు స్వయంగా క్యూ లైన్లలో పర్యటించి భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకుంటూ తక్షణ చర్యలు తీసుకున్నారు. మరోవైపు అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఇన్చార్జ్ ఈఓతో పాటు ఆలయ సిబ్బంది క్యూ లైన్ల నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ సమర్థవంతంగా నిర్వహించారు. పాలకమండలి, అధికారుల సమన్వయం మరియు సిబ్బంది కృషి ఫలితంగా భారీ రద్దీ ఉన్నప్పటికీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారి దర్శనం ప్రశాంతంగా సాగింది. ఆలయ యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లు, భక్తులకు కల్పించిన సౌకర్యాలపై సందర్శకులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Sign in with Google to comment.