ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఖాళీగా ఉన్న వేదపారాయణదారులు, అర్చకులు, పరిచారకులు, భజంత్రీలు, వంట స్వాములు తదితర 342 ధార్మిక పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించడం, పరిశీలన పూర్తి చేసి హాల్ టికెట్లు జారీ చేసిన అనంతరం తొలి దశగా వేదపారాయణదారుల మౌఖిక పరీక్షలను ప్రారంభించినట్లు వెల్లడించారు.
విజయవాడలోని మాడపాటి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఆలయాల్లో ఖాళీగా ఉన్న వైదిక సిబ్బంది పోస్టులను పూర్తిగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం సెంట్రలైజ్డ్ పరీక్షా విధానాన్ని అమలు చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 342 పోస్టులకు 5 వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న మల్టీ జోన్–1 అభ్యర్థులకు విజయవాడలో, గుంటూరు నుంచి రాయలసీమ వరకు ఉన్న మల్టీ జోన్–2 అభ్యర్థులకు సీతానగరంలో ఈ నెల 16వ తేదీ వరకు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
పరీక్షలన్నీ పూర్తి పారదర్శకంగా వీడియో రికార్డింగ్ మధ్య నిర్వహిస్తున్నామని, విద్యార్హతలు, వేదార్హతలు, అనుభవం, మౌఖిక పరీక్షలో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి నియామకాలు చేపడతామని తెలిపారు.
వేదపారాయణదారుల ఎంపిక పూర్తైన అనంతరం అర్చకులు, పరిచారకులు, భజంత్రీలు తదితర పోస్టులను కూడా దశలవారీగా భర్తీ చేస్తామని కమిషనర్ వెల్లడించారు.
Comments
Sign in with Google to comment.