ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ కే. రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం “యోగాంధ్ర” ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. దేవస్థానంలోని మహా మండపం ఆరో అంతస్తులో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ యోగా అధ్యాపకులు శ్రీ గర్రె రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన తొలి రోజు శిక్షణలో దేవస్థాన సిబ్బంది, అర్చకులు, అలాగే పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన విధానాలపై సమగ్ర అవగాహన కల్పిస్తూ ప్రాక్టికల్ శిక్షణ అందించారు.
ఈ వినూత్న కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) స్వయంగా పాల్గొని సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానసిక ప్రశాంతతకు నిలయాలైన దేవాలయాలకు మనస్సును ప్రశాంతపరిచే యోగ సాధనకు అవినాభావ సంబంధం ఉందని పేర్కొన్నారు. యోగం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల జూన్ 21 వరకు ప్రతిరోజూ ఉదయం దేవాలయంలో నిర్వహించే ఈ ఉచిత యోగా కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చైర్మన్ పిలుపునిచ్చారు. ‘యోగాంధ్ర’ ప్రారంభ కార్యక్రమంలో దేవస్థాన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ కిషోర్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ అవ్వారు శ్రీనివాసరావు, శ్రీ పెనుమత్స రాఘవరాజు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ వెలగపూడి శంకరబాబు, దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ దేవస్థానం తరఫున ఉచిత ప్రసాదాలు మరియు మంచినీటిని పంపిణీ చేశారు.
Comments
Sign in with Google to comment.