ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు కనీస ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు నగరపాలక సంస్థ సహకారంతో లో బ్రిడ్జి నుండి ప్రధాన దేవస్థానం వరకు ప్రతి వంద మీటర్లకు ఒక తాగునీటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సీతమ్మ వారి పాదాలు, దుర్గా ఘాట్, ఘాట్ రోడ్, ప్రధాన ఆలయ పరిసరాలు, మహా మండపం, శివాలయం తదితర రద్దీ ప్రాంతాల్లో మొత్తం 11 ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
ఉదయం పది గంటల నుండి క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరంగా మజ్జిగ, బిస్కట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. చిన్నారులు మరియు వృద్ధులకు పాలు అందజేస్తూ భక్తులకు ఉపశమనం కల్పిస్తున్నారు. అలాగే అన్నప్రసాద విభాగం ద్వారా భక్తులందరికీ నిరంతరం అన్నప్రసాదం అందిస్తున్నారు. భక్తులు ఎండ వేడి నుండి ఇబ్బంది పడకుండా ఉండేందుకు కనకదుర్గ నగర్ ఎంట్రన్స్ నుండి మహా మండపం వరకు, అలాగే ఘాట్ రోడ్ ఎంట్రన్స్ నుండి ప్రోటోకాల్ కార్యాలయం వరకు క్యూ లైన్ల పొడవునా షామియానాలు ఏర్పాటు చేశారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల దర్శన టిక్కెట్లను రద్దు చేసి భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. క్యూ లైన్లు వేగంగా కదిలేలా అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఏర్పాట్లను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనానాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
భక్తులతో నేరుగా మాట్లాడి అందుతున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మోడల్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను సందర్శించి సీసీటీవీల ద్వారా భక్తుల కదలికలను పరిశీలించారు. పోలీసు అధికారులతో సమన్వయం చేసి భద్రతా ఏర్పాట్లపై సూచనలు జారీ చేశారు. అలాగే అమ్మవారి సన్నిధిలో వివాహం చేసుకున్న నూతన దంపతులకు ప్రత్యేక దర్శనం కల్పించి ఆశీస్సులు అందజేశారు.
Comments
Sign in with Google to comment.