హిందూ ధర్మప్రచారంలో భాగంగా చెంచుగూడెములలో ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం మేకలబండ చెంచుగూడెంలో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్. నాయుడు, ఏపిడీ కె.పి. నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు గుల్ల గంగమ్మ, కోడె కాంతివర్థిని తదితరులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది, ఐటీడీఏ సిబ్బంది హాజరయ్యారు. ముందుగా క్షేత్రపాలకుడైన శ్రీ బయలువీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయం నుంచి మేకలబండలో ఏర్పాటు చేసిన కల్యాణవేదిక వరకు ధర్మప్రచార రథంతో శోభాయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా చెంచు భక్తులు గ్రామ ప్రధాన వీధిని రంగవల్లులతో అలంకరించి శోభాయాత్రకు ఘన స్వాగతం పలికారు. శోభాయాత్ర అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కార్యక్రమం సంకల్ప పఠనంతో ప్రారంభమై, మహాగణపతి పూజ, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, గౌరీపూజ, వరపూజ తదితర వైదిక కర్మలు నిర్వహించబడ్డాయి. అనంతరం మంగళాష్టకాల మధ్య సుముహూర్తంలో జీలకర్ర-బెల్లం సమర్పణ, మాంగల్యధారణ, తలంబ్రాలు వంటి ముఖ్య ఘట్టాలు నిర్వహించారు. కార్యక్రమం ముగింపులో పునఃపూజలు, ఆశీర్వచనాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెంచు భక్తులకు శేషవస్త్రాలు (పురుషులకు పంచా-కండువా, మహిళలకు చీర-రవిక) అందజేశారు. ఇదే కార్యక్రమం భాగంగా మే 7న మార్కాపురం జిల్లా చింతలలో కూడా ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Sign in with Google to comment.