విజయవాడ కనక దుర్గ దేవాలయం లో భక్తుల దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆలయ ఈవో వి కే షీనా నాయక్ చెప్పారు . వేసవి సెలవులు మరియు శుక్రవారం నేపథ్యంలో భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉండటంతో ఆలయంలో దర్శనాలు సాఫీగా కొనసాగుతున్నాయని వారు అన్నారు. ఈ సందర్భంగా ఈవో ఆలయ ప్రాంగణంలోని అన్ని విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు.
భక్తుల రద్దీ నియంత్రణలో ఉండటంతో క్యూలైన్లు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగాయని, జనసమ్మర్దం తక్కువగా ఉండటంతో అంతరాలయ దర్శనాలను కూడా నిరంతరాయంగా నిర్వహించినట్లు వారు చెప్పారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఉపశమనం కలిగించేందుకు దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఆలయ ప్రాంగణంలో చల్లని మజ్జిగ, సరిపడా తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు ఉచిత ప్రసాద పంపిణీ కేంద్రాల నిర్వహణను కూడా పరిశీలించినట్లు ఈవో వి కే షీనా నాయక్ అన్నారు.
కృష్ణా నది తీరాన ఉన్న దుర్గాఘాట్ ఆధునీకరణ పనులు వేగవంతగా సాగుతున్నాయి అని వారు చెప్పారు .
పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సౌకర్యార్థం ఘాట్లను ఆధునిక సదుపాయాలతో అందంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయిన అనంతరం అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కృష్ణా నదిలో పవిత్ర స్నానాలు మరింత సౌకర్యవంతంగా ఆచరించే అవకాశం కలుగుతుందని ఈవో వి.కె. షీనా నాయక్ చెప్పారు.
Comments
Sign in with Google to comment.