శ్రీశైలం దేవస్థానంలో ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
మార్చి 16 నుంచి 20 వరకు జరిగే ఉగాది ఉత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతున్నందున దర్శనం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునే విధంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్యూకాంప్లెక్సులు మరియు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందించాలని అన్నప్రసాద విభాగాన్ని ఆదేశించారు. అలాగే క్యూకాంప్లెక్సుల్లో ఫ్యాన్లు, కూలర్లు సక్రమంగా పనిచేసేలా ఎలక్ట్రికల్ విభాగం పర్యవేక్షణ చేయాలని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరా, దర్శనం నిర్వహణ, భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. పాదయాత్రగా వచ్చే భక్తుల కోసం వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట్ల, పెద్దచెరువు, మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాలిబాట మార్గంలో మంచినీటి సదుపాయం, భక్తులకు అన్నదానం చేసే దాతలకు దేవస్థానం నుంచి పూర్తి సహకారం అందించాలని అధికారులకు ఆదేశించారు.
ఉగాది మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించాలని కార్యనిర్వహణాధికారి పేర్కొన్నారు.
Comments
Sign in with Google to comment.