శ్రీశైల దేవస్థానంలో ధర్మకర్తల మండలి 5వ సమావేశం బుధవారం నిర్వహించబడింది. దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మొత్తం 28 అంశాలు చర్చించగా, వాటిలో 23 అంశాలు ఆమోదం పొందాయి. మరో 4 అంశాలను వాయిదా వేయగా, ఒక అంశాన్ని తిరస్కరించారు. సమావేశంలో ముఖ్యంగా సామాన్య భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు. రాబోయే 30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన మాస్టర్ ప్లాన్కు తుదిరూపం ఇవ్వడానికి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా డార్మెటరీ నిర్మాణం, శౌచాలయాలు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు వంటి సౌకర్యాలకు మాస్టర్ ప్లాన్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే శ్రీశైల క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిర్మాణాలు కూడా మాస్టర్ ప్లాన్లో పొందుపరచాలని తీర్మానించారు.
అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, క్షేత్ర సుందరీకరణకు అవసరమైన అంశాలను కూడా మాస్టర్ ప్లాన్లో చేర్చాలని నిర్ణయించారు. మల్లమ్మ కన్నీరు సమీపంలోని పురాతన కాలభైరవ ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. పరిపాలనా అంశాలలో భాగంగా గో సంరక్షణశాలలో గోవులకు గ్రాసం సరఫరా చేసేందుకు టెండర్లకు ఆమోదం తెలిపారు. అలాగే భక్తులకు అందించే కైలాస కంకణాల సరఫరాకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈ కంకణాల రూపకల్పన కోసం ధర్మకర్తల మండలి ఉపసంఘం, వైదిక సిబ్బంది, దేవస్థానం అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.
ఇక అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వహణ కోసం అవసరమైన ఆపరేషన్ చార్జీలకు టెండర్లు పిలవాలని కూడా సమావేశంలో నిర్ణయించారు.
Comments
Sign in with Google to comment.