ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానంలో గురువారం శ్రీస్వామి-అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఆరుద్రోత్సవంలో భాగంగా ఆలయంలో తెల్లవారుజామున నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఈ సందర్భంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, అలాగే విశేష పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ఆవరణలో స్వర్ణరథోత్సవాన్ని ఘనంగా జరిపించారు. రథోత్సవానికి ముందు ఆలయ అర్చకులు లోకకల్యాణం కోసం ప్రత్యేక సంకల్పం చేశారు. దేశంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని, అతివృష్టి-అనావృష్టి వంటి ప్రకృతి విపత్తులు దూరమవ్వాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు.
అలాగే ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అకాల మరణాలు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు వంటి అనర్థాలు జరగకుండా ఉండాలని వేదోచ్ఛారణల మధ్య సంకల్ప పఠనం నిర్వహించారు. తదనంతరం రథారూఢులైన శ్రీస్వామి-అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి, భక్తుల శివనామస్మరణ మరియు వేద మంత్రోచ్ఛారణల నడుమ ఉదయం సుమారు 7.30 గంటలకు స్వర్ణరథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ రథోత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు ఘనంగా కొనసాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో కోలాటం, తప్పెట చిందులు వంటి పలు జానపద కళారూపాలు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కళా ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపోతుగుంట రమేష్నాయుడు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు, వివిధ విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు
Comments
Sign in with Google to comment.