ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులు మరింత దృష్టి సారిస్తున్నారు. భక్తుల అభిప్రాయాలను IVRS కాల్స్ ద్వారా సేకరిస్తున్న RTGS శాఖ నివేదికల ఆధారంగా, ముఖ్యంగా త్రాగునీటి సదుపాయాలు మరియు పారిశుద్య నిర్వహణ అంశాల్లో మరింత మెరుగుదల అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు, ఈరోజు ఉదయం ఆలయ ఈవో శీనానాయక్ దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఘాట్ రోడ్ ఓం పాయింట్ నుండి ప్రధాన ఆలయం లోపలి ప్రాంతం వరకు త్రాగునీటి సరఫరా వ్యవస్థ, పారిశుద్య పరిస్థితులు, భక్తులకు అందుతున్న మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు.
అవసరమైన చోట్ల వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా కూల్ పెయింట్, కాయిర్ మ్యాట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అలాగే భక్తులకు ఉపశమనం కలిగించేలా చలువ పందిళ్లు, చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమాదేవి, ఏఈవో ఎన్. రమేష్ బాబు సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.