ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికత, ఆహ్లాదం, అభివృద్ధి కలిసిన అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు, అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ (ADC) చైర్పర్సన్ లక్ష్మి పార్ధసారధి భాస్కర్ ఆదేశాలతో ప్రత్యేక నిపుణుల బృందం గురువారం ఇంద్రకీలాద్రిని సందర్శించింది.
హైదరాబాద్లోని ప్రసిద్ధ ‘కన్హ శాంతివనం’ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నిపుణులు డాక్టర్ రమాకాంత్, శరవణన్, శరత్ లతో పాటు అమరావతి అభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాస్ ఈ బృందంలో ఉన్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మానసిక ప్రశాంతతను అందించేలా కొండపై పచ్చదనాన్ని పెంపొందించడంపై ఈ బృందం ప్రత్యేక దృష్టి సారించింది. ఆలయ ఈవో శీనా నాయక్ తో కలిసి నిపుణుల బృందం పలు ప్రాంతాల్లో పచ్చదనం పెంపుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించింది.
ఇందులో శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయ పరిసరాలు, కనకదుర్గ నగర్ నుంచి మహా మండపం వరకు ఉన్న మార్గం, ఘాట్ రోడ్ రిటైనింగ్ వాల్ నుంచి ప్రధాన ఆలయం వరకు ప్రాంతం, అలాగే ఘాట్ రోడ్ దిగువ ప్రాంతం మరియు మౌనస్వామి ఆలయం వెనుక భాగం ఉన్నాయి. ఈ సందర్భంగా దేవస్థానం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను ఆలయ ఈవో శీనా నాయక్ నిపుణుల బృందానికి వివరించారు.
ఈ ప్రణాళికలో భాగంగా ఇంద్రకీలాద్రిని పర్యావరణ హిత ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు నిపుణుల బృందం తమ సూచనలను అందించనుంది. అత్యున్నత ప్రమాణాలతో ఇంద్రకీలాద్రి రూపురేఖలను మార్చి, భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే లక్ష్యమని బృంద సభ్యులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు, ప్రతిపాదనలు సిద్ధం చేసి, దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి సంయుక్తంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
Comments
Sign in with Google to comment.