ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న శ్రీ గంగా, పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. మార్చి 29 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి పండితులు మూల మంత్ర హవనాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఔపాసన, బలిహరణ, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తిపూర్వకంగా జరిగాయి.
రావణ వాహనంపై మల్లేశ్వర స్వామి విహారం చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 5 గంటలకు మల్లేశ్వర మహామండపం నుంచి శ్రీ గంగా, పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వరుల రావణ వాహన సేవ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పురాణాల ప్రకారం రావణుడు లంకాధిపతి, పౌలస్త్య బ్రహ్మ వంశస్థుడు, అలాగే పరమశివుని మహాభక్తుడు. శివుని అంశతో జన్మించిన రావణుడు ప్రతిరోజూ శివారాధన, అభిషేకాలు నిర్వహించిన తర్వాతే ఆహారం స్వీకరించేవాడని పురాణోక్తి. అంతటి శివభక్తుడైన రావణుడు, పరమశివుడిని కైలాసం నుంచి లంకకు తీసుకురావాలని సంకల్పించి, కఠోర తపస్సు చేశాడని, శివతాండవ స్తోత్రంతో శివుడిని ప్రసన్నం చేసుకున్నాడని ఆధ్యాత్మిక విశ్వాసం.
సంప్రదాయ కళారూపాలతో వాహన సేవకు భక్తిరస వాతావరణం ప్రఖ్యాతిగాంచిన రావణ వాహనంపై స్వామివారు, అమ్మవార్లు కొలువై ఉండగా, తప్పెట్లు, కోలాట నృత్యాలు, తాళం భజన వంటి సంప్రదాయ కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ శ్రేణి మహా మండపం నుంచి ప్రారంభమై, కనకదుర్గ నగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామారంగం చౌక్, మెయిన్ బజార్ మార్గాల మీదుగా కొనసాగింది
పాల్గొన్న ఆలయ అధికారులు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వీకే శీనా నాయక్ కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానాచార్యులు వి. శివ ప్రసాద్ శర్మ, ట్రస్ట్ బోర్డు సభ్యులు పి. రాఘవరాజు, ఎ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Sign in with Google to comment.