అన్నవరం రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాలను పురస్కరించుకుని, విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధి నుండి పట్టువస్త్రాలను ఆదివారం సాయంత్రం ఘనంగా సమర్పించారు.
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ, ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికార బృందం రత్నగిరి క్షేత్రానికి చేరుకుంది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) దంపతులు, కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ దంపతులు, అర్చకులు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పట్టువస్త్రాలతో అన్నవరం చేరుకోగా, రత్నగిరి దేవస్థాన అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు.
మంగళవాయిద్యాల నడుమ శ్రీ కనకదుర్గ అమ్మవారి తరపున పట్టువస్త్రాలు, పూజా సామాగ్రిని స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. అనంతరం స్వామివారి దర్శనం అనంతరం, అన్నవరం దేవస్థానం ఈవో చక్రధరరావు ఆధ్వర్యంలో వేద పండితులు ఇంద్రకీలాద్రి బృందానికి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఇరు దేవస్థానాల అధికారులు ఆధ్యాత్మిక విశేషాలను పరస్పరం పంచుకున్నారు.
కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి. రాఘవరాజు, ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాసశాస్త్రి, సిబ్బంది ఎం. జయప్రకాష్ (జెపి), కె. లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవ వేళ ఇంద్రకీలాద్రి అమ్మవారి పట్టువస్త్రాల సమర్పణ, ఈ రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని మరోసారి స్పష్టంగా ప్రతిబింబించింది.
Comments
Sign in with Google to comment.