శ్రీశైలం దేవస్థానంలో ధర్మకర్తల మండలి 6వ సమావేశం మంగళవారం నిర్వహించబడింది. దేవస్థానం కార్యాలయ భవనంలోని మీటింగ్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో మండలి అధ్యక్షుడు శ్రీపోతుగుంట రమేష్నాయుడు, సభ్యులు శ్రీ బోడేపూడి వెంకటసుబ్బారావు, శ్రీమతి జవ్వాజి రేఖాగౌడ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సహా పలువురు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. సమావేశంలో మొత్తం 22 అజెండా అంశాలను చర్చించగా, వాటిలో 15 అంశాలకు ఆమోదం లభించింది. ఐదు అంశాలను వాయిదా వేయగా, రెండు అంశాలను తిరస్కరించారు. సమావేశం ప్రారంభంలో అధ్యక్షుడు మాట్లాడుతూ, క్షేత్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసి, వారికి పూర్తి సంతృప్తి కలిగేలా చర్యలు చేపడతామని చెప్పారు. ముఖ్య నిర్ణయాలుగా క్షేత్ర పరిధిలో భక్తుల రద్దీ ఉన్న 20 ప్రదేశాల్లో బి.ఓ.టి విధానంలో శాశ్వత ప్రజా శౌచాలయాలను నిర్మించాలని తీర్మానించారు. ఈ పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. టోల్ గేట్ నుంచి కుమారసదనం వరకు రూ. 24 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. వర్క్షాప్ నుంచి పాతాళగంగ పాత మెట్ల వరకు రూ. 36.5 లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ బైపాస్ పనులు చేపట్టాలని నిర్ణయించారు.
దేవస్థానం గో సంరక్షణశాలలో గోవులకు అవసరమైన గడ్డి సరఫరాకు సంబంధించిన టెండర్కు ఆమోదం లభించింది. అలాగే సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్స్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త శాఖ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇక భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుత డార్మిటరీలను ఆధునీకరించడంతో పాటు కొత్త డార్మిటరీలను నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాబోయే వర్షాకాలంలో కనీసం ఆరు వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. శ్రీశైలం క్షేత్ర అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
Comments
Sign in with Google to comment.