భక్తులకు మరింత సులభతర సేవలు అందించేందుకు శ్రీశైలం దేవస్థానం కీలక చర్యలు చేపట్టింది. దేవస్థానం పరిధిలో పలుచోట్ల సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేసి, లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కియోస్క్లను మంగళవారం సాయంత్రం కార్యనిర్వహణాధికారి మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రారంభించారు.
ఆలయ సంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఈ మిషన్లు ప్రారంభించబడ్డాయి. ఈ కియోస్క్ల ద్వారా భక్తులు దర్శనం, ప్రసాదం, కేశఖండన టికెట్లను సులభంగా పొందవచ్చు. అలాగే దేవస్థానం వివిధ పథకాల కోసం విరాళాలు కూడా చెల్లించేందుకు వీలుంది. సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్, మల్లికార్జునసదన్, గంగాసదన్, కల్యాణకట్ట, పాత విరాళాల కేంద్రం మరియు గంగాధర మండపం వద్ద ఉన్న కొత్త విరాళాల కేంద్రాల్లో కూడా ఈ కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి.
ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు మాట్లాడుతూ, భక్తులకు సాంకేతిక ఆధారిత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కియోస్క్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా భక్తులు టికెట్లను స్వయంగా పొందే అవకాశం కలుగుతుందని, దీని వల్ల సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మనమిత్ర’ వాట్సాప్ సేవ ద్వారా దేవస్థానానికి సంబంధించిన 17 రకాల టికెట్లను ముందస్తుగా పొందే సౌకర్యం అందుబాటులో ఉంది. అదేవిధంగా దేవస్థానం అధికారిక వెబ్సైట్ www.srisailadevasthanam.org� మరియు దేవదాయశాఖ వెబ్సైట్ www.aptemples.ap.gov.in� ద్వారా కూడా దర్శనం, ఆర్జిత సేవ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
కాగా ఈ కియోస్క్ మిషన్లను కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)లో భాగంగా కరూర్ వైశ్య బ్యాంక్ దేవస్థానానికి అందజేసింది.
Comments
Sign in with Google to comment.