శ్రీశైల దేవస్థానంలో వయోపరిమితి కారణంగా పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యుడు చిట్టిబొట్ల భరద్వాజశర్మతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, దేవస్థానంలో హోదాలు వేర్వేరు అయినప్పటికీ ప్రతి ఉద్యోగి సేవ శివకైంకర్యమేనని పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ విధులను అంకితభావంతో నిర్వహించి దేవస్థాన అభివృద్ధికి విశేష సేవలందించారని కొనియాడారు.
అనంతరం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు శ్రీస్వామి–అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించారు.
దేవస్థాన ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, సహోద్యోగులు కూడా వారికి అభినందనలు తెలియజేశారు
Comments
Sign in with Google to comment.